చర్లపల్లి-తిరుపతి మధ్య కొత్త ఎక్స్ ప్రెస్ రైలు... టైమింగ్స్ ఇవిగో!

  • రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
  • నల్గొండ - కడప మార్గంలో ప్రయాణించనున్న రైలు
  • ఈ నెల 28న ప్రారంభం కానున్న తిరుపతి - చర్లపల్లి రైలు
హైదరాబాద్ నుంచి తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. చర్లపల్లి - తిరుపతి మధ్య రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును కొత్తగా ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ కొత్త రైలు నల్గొండ-కడప మార్గంలో ప్రయాణిస్తుందని తెలిపింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వారికి తిరుపతి చేరుకోవడం సులభమవుతుంది.

ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి తిరుపతికి పద్మావతి ఎక్స్‌ప్రెస్ వరంగల్ - విజయవాడ మార్గంలో, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మహబూబ్ నగర్ - గుత్తి మార్గంలో, నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్, వందేభారత్ రైళ్లు నల్గొండ - గుంటూరు మార్గంలో నడుస్తున్నాయి. ఇప్పుడు ప్రవేశపెట్టిన కొత్త రైలు ప్రత్యామ్నాయ మార్గంలో అందుబాటులోకి రానుండటం గమనార్హం. ఈ సర్వీస్ ఈ నెల 28న ప్రారంభం కానుంది.

ఇప్పటి వరకు చర్లపల్లి - తిరుపతి మార్గంలో ప్రత్యేక రైలుగా నడిచిన సర్వీసును ఇక నుంచి రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా కొనసాగిస్తారు. తిరుపతి నుంచి గురువారం సాయంత్రం నాలుగున్నర గంటలకు బయలుదేరి రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం రోడ్, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా మరుసటి రోజు ఉదయం 8.25 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

అలాగే, చర్లపల్లి నుంచి ప్రతి శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు బయలుదేరి బీబీనగర్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, మార్కాపురం రోడ్, గిద్దలూరు, నంద్యాల, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా ప్రయాణించి శనివారం ఉదయం 7.30 గంటలకు తిరుపతి చేరుకోనుంది. ఈ సర్వీసు ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

Charlapalli Tirupati Express
Tirupati
Charlapalli
Indian Railways
South Central Railway
Weekly Express Train

More Telugu News